ఏలూరు (ఆర్ఆర్పేట): వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ అధికారులను ఆదేశించారు. చవితి ఉత్సవాలు, నిమజ్జనం ముందస్తు జాగ్రత్తలపై మంగళవారం కలెక్టరేట్ నుండి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షించి గ్రామ కమిటీలు వేయాలని సూచించారు. ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా నిమజ్జన ఘాట్ల వద్ద బారికేడ్లు, నిరంతర విద్యుత్, సరిపడా వెలుగునిచ్చే లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ, డీఎస్పీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


