ద్వారకాతిరుమల: రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు క్యాడర్ సభ్యులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం ఏలూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేష్ సూచించారు. మండలంలోని గుండుగోలనుకుంట గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయం బయోరిసోర్స్ సెంటర్ల (బీఆర్సీ) బలోపేతంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ రైతులకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, పీఎండీఎస్ విత్తన కిట్లు, వివిధ రకాల కషాయాలు వంటి ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్లను అందుబాటులో ఉంచి, ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై ఆధారపడకుండా రైతులు ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్లను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్సీల నిర్వహణ, సేల్స్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బుక్ నిర్వహణ విధానాలుపై శిక్షణ అందించడంతో పాటు, బీఆర్సీ ఈ–స్టాక్ వెబ్ యాప్ వినియోగం, స్టాకు నమోదు, అమ్మకాలు నమోదు, డిజిటల్ రికార్డుల నిర్వహణపై ప్రాయోగాత్మక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డీపీఎంలు వాలి, ఒ.గోపాలకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


