కుటుంబ సభ్యుల వద్దకు చేరిన తల్లి, కూతురు
చింతలపూడి: క్షణికావేశంలో ఇల్లు వదిలి వెళ్లిన తల్లి, కూతురిని ఎఫ్ఆర్ఎస్ 360 సీసీ టీవీ సాంకేతికతతో పోలీసులు గుర్తించి, మూడేళ్ల తర్వాత వారి కుటుంబం చెంతకు చేర్చారు. చింతలపూడి మండలం ఎరగ్రుంటపల్లి గ్రామానికి చెందిన వీసం శైలజ, మూడేళ్ల క్రితం భర్తతో గొడవపడి తన కుమార్తె తనుశ్రీని తీసుకుని వెళ్లిపోయింది. అప్పట్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఆచూకీ లభించలేదు. ఇటీవల చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె.సతీష్ కుమార్, హెచ్సీ రాంభద్రరావు బృందం ఆధునిక ఎఫ్ఆర్ఎస్ 360శ్రీ సీసీటీవీ టెక్నాలజీ సాయంతో శైలజ, ఆమె కుమార్తెను ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం వారిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడేళ్ల తర్వాత విడిపోయిన కుటుంబాన్ని కలిపిన పోలీసులను గ్రామస్తులు అభినందించారు.


