తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి
ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి
కై కలూరు: తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీపీ.శ్రీదేవి సూచించారు. ఆటపాక బ్రాంచి పోస్టాఫీస్ను మంగళవారం ఆమె సందర్శించారు. అనంతరం కై కలూరు, పల్లెవాడ పోస్టాఫీసుల పరిధిలోని 20 బ్రాంచి పోస్టాపీసుల గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తపాలశాఖ ఐవీ 2.0 అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.కృష్ణమూర్తి, ఏఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, కై కలూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ కె.సురేష్కుమార్, ఇన్స్పెక్టర్ బి.విజయ్ పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమౌతాయని వివరించారు. వివరాలకు 70136 33143లో సంప్రదించాలన్నారు.
భీమడోలు: గుండుగొలను గ్రామంలోని మెయిన్ రోడ్డులోని వినాయకుని ఆలయం, రామాలయం, గంగానమ్మ ఆలయాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయాల్లో హుండీ అపహారణ, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. రామాలయంలోని హుండీని అపహరించి, అందులోని రూ.15 వేలు నగదు కాజేశారని రామాలయం కమిటీ సభ్యుడు వెలివెల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ, వేలిముద్రలను సేకరించారు.
జంగారెడ్డిగూడెం: ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడి కూలీ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. పట్టణానికి చెందిన జాలా ప్రసాద్ (49) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న ఓ రైతుకు చెందిన పొగాకు తోటలో పనికి వెళ్లిన ప్రసాద్, అక్కడ నుంచి ట్రాక్టర్లో పొగాకు లోడు వేసుకుని వస్తున్నాడు. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రాజారాణి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్, ట్రక్కు తిరగబడటంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి


