నృసింహ మహాయజ్ఞానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహాయజ్ఞ నిర్వహణకు మంగళవారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు వేద పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో ప్రధాన యజ్ఞం ప్రారంభానికి సూచికగా మహా గణపతి లక్షమోదక హోమాన్ని ఆలయ యాగశాలలో వైభవంగా జరిపారు. సాయంత్రం వరకూ నిర్విరామంగా కొనసాగిన ఈ హోమ క్రతువుతో సుందరగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞ క్రతువులో భాగంగా ఈనెల 13న అంకురార్పణం, ధ్వజారోహణం, శ్రీ నృసింహ హోమం, 14న కలశప్రతిష్ఠ, మహా గణపతి హోమాన్ని నిర్వహించనున్నారు. 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని మహా లింగార్చన, రాత్రి అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహా యజ్ఞాన్ని వైభవంగా జరుపనున్నారు. అలాగే 16న నిర్వహించే కలశాభిషేకం, శాంతి కల్యాణంతో యజ్ఞ క్రతువు ముగియనుంది. ప్రతి రోజూ శాలిగ్రామ ఆరాధన, లక్ష బిల్వార్చన, లలితా సహస్ర నామార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని నరసింహ గురూజీ తెలిపారు.
ఈనెల 15న మహాయజ్ఞం


