భూసేకరణ భయం
న్యూస్రీల్
సింగరేణి ప్రాజెక్టు సమయంలో..
గ్రామ సభలు లేకుండానే..
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మార్కెట్లో ఎకరా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ధర ఉంది. రైతులు నష్టపోకుండా పరిహారం అందించాలి. గతంలో ఒక్కోచోట ఒక్కో ధర చెల్లించారు. ఇది భూసేకరణ చట్టానికి విరుద్ధం. మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇప్పించాలి. బొగ్గు విషయంలో కూడా రైతులను, ప్రజలను చైతన్య పరిచి ఒప్పించాలి.
– పి.సోమశేఖరాచార్యులు,
రైతు, యర్రగుంటపల్లి, చింతలపూడి మండలం
రైతులను ఒప్పించి భూసేకరణ జరపకుండా బొగ్గు గనులకు టెండర్లు ఎలా పిలుస్తారు. గతంలో గ్రీన్ఫీల్డ్ హైవే విషయంలో కూడా రైతులతో సంతకాలు తీసుకుని అవార్డు పాస్ చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ చేపడితే రైతులు తొందరపడి సంతకాలు పెట్టవద్దు.
– గిరి భోగారావు,
మాజీ సొసైటీ చైర్మన్, రాఘవాపురం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మెట్ట ప్రాంత రైతులకు భూసేకరణ భయం పట్టుకుంది. కేంద్ర ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రాజెక్టులంటూ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదలు తాజాగా రేచర్ల బొగ్గు బ్లాక్ వరకూ అన్నింటికీ భూసేకరణే కీలకం. ఇక తాజాగా రేచర్లలో బొగ్గు బ్లాక్ టెండర్లు ఖరారైనట్టు పల్లెల్లో విస్తృత ప్రచారం మొదలుకావడంతో రైతుల్లో భూసేకరణ భయం తారాస్థాయికి చేరింది.
బ్లాక్లుగా విభజించి..
ఖమ్మం, ఏలూరు జిల్లా సరిహద్దుల్లో భారీ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు 12 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, కృష్ణా, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతాల్లో భారీగా బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించి 1964 నుంచి 2016 వరకు నాలుగు విడతలుగా సర్వేలు నిర్వహించి 2016లో ఖరారు చేశారు. ఈ దశ దాటుకుని 2017 నుంచి చింతలపూడి కేంద్రంగా బొగ్గు నిల్వలను ఎంత లోతులో ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసి బ్లాక్లుగా విభజించారు.
2023లో ఖరారు : చింతలపూడి మండలంలోని రేచర్ల బొగ్గు బ్లాక్లు 2023లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పరిధిలో 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల బొగ్గు బ్లాక్ను ఖరారు చేశారు. దీని పరిధిలో జీ–13 గ్రేడ్కు సంబంధించిన నాణ్యమైన బొగ్గు దాదాపుగా 2,225.63 మిలియన్ టన్నులు ఉన్నట్టు అంచనా వేసి ఆ మొత్తానికి టెండర్ ప్రక్రియ గతేడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభించింది. అక్టోబర్ 27 వరకు టెండర్ దాఖలు తుది గడువు, 28న టెక్నికల్ గ్రిడ్ల పరిశీలన, ఖరారు, నవంబర్ 24 నుంచి 28 వరకు ఈ–వేలం ద్వారా కేటాయించేలా టెండర్ షెడ్యూల్ ప్రకటించారు. వాస్తవానికి అంతకు ముందు రెండుసార్లు ఏర్పాటు చేసినా టెండర్ దశలో నిలిచిపోయింది. మూడో సారి మాత్రం టెండర్లలో రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ సంస్థ సంయుక్తంగా బిడ్లు దాఖలు చేశాయి. కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యాక బొగ్గు నిల్వల తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేచర్ల బ్లాక్లో గ్రేడ్–1 బొగ్గు ద్వారా ఏటా 8 వేల మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
చింతలపూడిలోని రేచర్ల, శెట్టివారిగూడెం, వెంకటాపురం, యర్రగుంటపల్లి, అల్లిపల్లి, ఊటసముద్రం, సీతానగరం, చింతంపల్లి, నామవరం, వెంకట్రాదిగూడెం, కాంతంపాలెం, చింతలపూడి రూరల్ మండలంలో కొంత భాగం బొగ్గు తవ్వకాలు కోసం భూసేకరణ జరిగే అవకాశం ఉంది. గతంలో సింగరేణి ప్రాజెక్టు సమయంలో భూసేకరణ ప్రక్రియ జరిగినప్పుడు భూములు కోల్పోయిన వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు ఇంటికొక ఉద్యోగం, అలాగే సంస్థ లాభాల్లోంచి కొంత రాయల్టీగా ఇచ్చి భూసేకరణ ప్రక్రియ నిర్వహించారు.
రైతుల్లో గుబులు
రేచర్ల బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ పూర్తి
పరిహారాలు, భూసేకరణపై స్పష్టత కరువు
టెండర్లు ఖరారైనట్టు విస్తృత ప్రచారం
చింతలపూడి మండలంలో 22.24 చ.కి. పరిధిలో నిల్వలు
ఇప్పటికే వరుస భూసేకరణలతో రైతులు విలవిల
గ్రామసభలు, డీపీఆర్లు లేకుండా టెండర్లు ఏంటంటూ మండిపాటు
వాస్తవానికి ప్రాజెక్టు ఖరారయ్యాక రెవెన్యూ యంత్రాంగం భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే నిర్వహించాలి. ఎంత భూమి అవసరమవుతుంది, ఎన్ని గ్రామాల్లో భూమి సేకరించాల్సి ఉంటుందనే నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ చట్టం ప్రకారం భూమి విలువకు మూడు రెట్లు పరిహారం ప్రకటించాలి. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామ తీర్మానాల ద్వారా సేకరణ ప్రక్రియ నిర్వహించి భూములను సదరు సంస్థకు అప్పగించి వారి నుంచి పరిహారం రైతులకు అందేలా చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఏదీ లేకుండానే బొగ్గు బ్లాక్లను ఖరారు చేయడం, టెండర్లు తుది దశకు తీసుకురావడంతో తర్వాత ఏం జరుగుతుందనే దానిపై పల్లెల్లో భయం మొదలైంది. ఇప్పటికే చింతలపూడి ఎత్తిపోతల పథకం, గ్రీన్ఫీల్డ్ హైవే కింద భూములను తీసుకుని మార్కెట్ విలువల్లో 40 శాతం కూడా పరిహారం ఇవ్వకపోవడంపై అన్నదాతల్లో ఆగ్రహం ఉంది. ఈ క్రమంలో తాజా భూసేకరణ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
భూసేకరణ భయం
భూసేకరణ భయం
భూసేకరణ భయం
భూసేకరణ భయం


