
కుల బహిష్కరణపై ఫిర్యాదు
పాలకోడేరు: మండలంలోని పెన్నాడ అగ్రహారంలో తమ మాట వినడం లేదని కుల పెద్దలు సుమారు 28 మందిని కులం నుంచి వెలి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకోడేరు పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని శెట్టిబలిజ పెద్దలు దొమ్మేటి వేణుగోపాలం, పంపన వెంకటేశ్వరరావు, పాల శేషు, గుత్తుల కొండలరావు, జక్కంశెట్టి బాలమురళీకృష్ణ, చింతపల్లి రామకృష్ణ తమ మాట వినడం లేదంటూ మూడేళ్ల క్రితం కొంత మందిని, ఏడాది క్రితం కొంత మందిని, ఏడు నెలల క్రితం మరో కొంత మందిని మొత్తం 28 మందిని కులం నుంచి వెలి వేశారు. ప్రేమ పెళ్లి విషయంలోనూ, స్థలం అమ్మకం విషయంలోనూ, డ్రెయినేజీ నిర్మాణ విషయంలోనూ ఇలా మమ్మల్ని బహిష్కరించినట్లు దొంగ నాగలక్ష్మి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి సురేష్, గుత్తుల నాగరాజు, జక్కం శెట్టి సత్య నాగరాజు, సిహెచ్ సుబ్రమణ్యం, చింతపల్లి శివప్రసాద్, గుత్తుల శ్రీనివాస్, చీరబోయిన శ్రీనివాసరావు, బొక్కా రమేష్, పంపన రవి మొత్తం 28 మందిని బహిష్కరించారు. అప్పటి నుంచి శుభకార్యాలకు పిలవడం లేదు. అంతేగాక ఇళ్లకు వచ్చిన చుట్టాలను కూడా అవమానిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాస్, పాలకోడేరు ఎస్సై రవి వర్మ, పంచాయతీ కార్యదర్శి కె.వెంకటరాజు, ఆర్ఐ రాఘవ రాజు, వీఆర్వో సుబ్రహ్మణ్యం తదితరులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో బాధితులను విచారించారు. కాగా నిందితులు తాము గ్రామాంతరం వెళ్లామని చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు.

కుల బహిష్కరణపై ఫిర్యాదు