
కొనసాగిన లేఖర్ల పెన్డౌన్
భీమడోలు: రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న కొత్త విధానాలతో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు చేపట్టిన పెన్డౌన్ కార్యక్రమం శనివారం కొనసాగింది. భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు నిరసన తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్తంభించింది. భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాలకు చెందిన దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు తరలివచ్చారు. నూతన సంస్కరణల వల్ల ప్రజలు, లేఖర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దస్తావేజు తయారీ ప్రక్రియలో జాప్యం అవుతుందని అన్నారు. ఈ విధానాన్ని పునః సమీక్షించాలని కోరారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. లేఖర్లు రెండు రోజులపాటు చేపట్టిన పెన్డౌన్ ముగిసింది. ఉమ్మడి జిల్లా దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి నండూరి శ్రీరామ్, భీమడోలు దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్షుడు వెజ్జు నాగేశ్వరరావు, కార్యదర్శి వర్ధనీడి బాలమురళీకృష్ణ, కోశాధికారి శీమకుర్తి రాము తదితరులు పాల్గొన్నారు.
కై కలూరు: రైల్వేట్రాక్ మరమ్మతుల నిమిత్తం (లెవిల్ క్రాసింగ్ గేటు నం.79) పామర్రు–దిగమర్రు 165 జాతీయ రహదారిలో భైరవపట్నం రైల్వేగేటును ఈనెల 24న ఉదయం 7 గంటల నుంచి 30న రాత్రి 7 గంటల వరకు మూసివే స్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే కై కలూరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎండీ రెహమాన్ శనివా రం తెలిపారు. గుడివాడ–కై కలూరు మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పోలవరం రూరల్: పాపికొండలు అందాలను తిలకించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన టూరిజం బోటును అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ చలపతిరావు శనివారం ప్రారంభించారు. కొరుటూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాటేజ్లు బుక్ చేసుకునే టూరిస్ట్లకు ఈ బోటు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ముందుగా ఆయన పట్టిసం శివక్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన టూరిజం బోటును ప్రారంభించారు. రాజమండ్రి సీసీఎఫ్ డీఎన్ఎన్ మూర్తి, ఏలూరు డీఎఫ్ఓ సతీష్ రెడ్డి, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, పోలవరం రేంజ్ అధికారి ఎస్కే వలీ పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో 4జీ, 5జీ మొబైల్ నెట్వర్క్ లేని గ్రామాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు ముందుకు రావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జియో, ఎయిల్టెల్ కంపెనీలకు నాలుగేసి చొప్పున టవర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు. బీఎస్ఎన్ఎల్కు 43 టవర్లకు గాను 13 టవర్లుకు అనుమతులు ఇచ్చామన్నారు. మిగిలిన టవర్ల ఏర్పాటుకు జాయింటు ఇన్స్పెక్షన్ చేసుకుని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జిల్లా కలెక్టరేట్ ల్యాండు సెక్షన్ సూపరింటెండెంట్ బీవీ శేషగిరి, బీఎస్ఎన్ఎల్ ఏజిఎం వి.హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా చేశారు. వీఆర్ఏలకు పేస్కూల్ వర్తింపజేయాలని, పదోన్నతులకు అర్హులైన వీ ఆర్ఏలను ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్స్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టుల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. నామినీగా చేస్తున్న వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు శాంతియుతంగా ధర్నా చేశా రు. అనంతరం జిల్లా సంఘ అధ్యక్షుడు బుంగా గణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం. మోషే ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.