
గురువుల మెడపై బోధనేతర కత్తి
నిడమర్రు: పాఠశాల తెరిచి నెల రోజులు పూర్తవుతున్నా కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలతో నేటికీ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు తరగతి గదికి హాజరుకాలేని పరిస్థితి. ఇప్పటికీ బోధనేతర పనులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు బిజీబిజీగా గడుపుతున్నారు. రోజు రోజుకీ వాట్సాప్లో అర్జెంట్ మెసేజ్లు, ఆన్లైన్ వర్క్లు, వెబ్ఎక్స్ మీటింగ్లతోపాటు నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి నిర్ణయాలను జీర్ణించుకోలేని నెల్లూరు జిల్లాలోని కోటితీర్థంకు చెందిన ఎంపీపీ పాఠశాల హెచ్ఎం ఎం.మధుసూదనరావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఉపాధ్యాయుల మెడపై ఇలా భోతనేతర పనుల కత్తి వేలాడుతుండడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు లోపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. దీంతో ఈ విద్యాసంవత్సరంలో 1వ తరగతిలో విద్యార్థుల నమోదు గణనీయంగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 117 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని గణాంకాలు చెబుతుండడం గమనార్హం.
నెలంతా బోధనేతర కార్యక్రమాలే..
● జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచినా ఎస్జీటీలకు, ఎంటీఎస్, వృత్తి విద్యా టీచర్స్ బదిలీల కౌన్సిలింగ్ నిర్వహణతో పదిహేను రోజులు గడిచిపోయాయి.
● అనంతరం గిన్నిస్ రికార్డు కోసం జూన్ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తుగానే ఆయా కార్యక్రమాలు చేపట్టింది. వీటిల్లో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు.
● ఆ తరువాత ఈనెల 10వ తేదీన తలపెట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (మోగా పీటీఎం)కు సంబంధించి పది రోజుల ముందగానే వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
● హమ్మయ్య.. అది కూడా ముగిసిందనుకుంటే ఈనెల 14 నుంచి స్కూల్ లీడర్ షిప్, ఎఫ్ఎల్ఎన్ వంటి శిక్షణ కార్యక్రమాలు ఈ నెలాఖరు వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తరగతి గదులకు దూరమవుతున్నారు. దీంతో తరగతులు సక్రమంగా జరగక పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మొరాయిస్తున్న యాప్లతో ఆందోళన
మరో వైపు మొరాయిస్తున్న యాప్లతో సైతం ఉపాధ్యాయులు విసిగిపోతున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న అన్ని యాప్లను ఒకే వేదికపైకి తీసుకు వచ్చి లీప్ (లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) యాప్ను రూపొందించారు. దాంట్లోనే ఐఎంఎంఎస్, స్టూడెంట్ కిట్స్, మెగాపీటీఎం వంటివాటిని అనుసంధానం చేశారు. దీంతో సర్వర్ డౌన్ సమస్యలతో నేటికీ అన్లైన్లో టీచర్ ఫోటో హాజరు నమోదుకు ఉదయం, సాయంత్రం వేళల్లో 5 నుంచి 15 నిమిషాలు పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఇదిలా ఉంటే నేటి నుంచి విద్యార్ధి మిత్ర కిట్లు విద్యార్థులకు అందినట్లు తల్లింద్రడులతో బయోమెట్రిక్ వెయించాలని చెబుతున్నారు. కానీ ఏ పాఠశాలలో కూడా దీనికి సంబంధించిన డివైజ్ మిషన్స్ అదుబాటులో లేని పరిస్థితి. పెద్ద స్కూళ్లలో క్లాస్ టీచర్కు ఒక వారం రోజులు ఇదే పనిలో ఉండాల్సిందే అని చెబుతున్నారు.
సన్నబియ్యం బస్తా చుట్టూ తిరగాల్సిందే
ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకంకు సంబంధిచి పాఠశాలలకు సన్నబియ్యం అందించారు. ప్రతి నెలా పాఠశాలకు అందిన అన్ని బస్తాలపై క్యూఆర్ కోడ్లను ఉపాధ్యాయులు స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలి. తర్వాత వంటకు ముందు ఆ బస్తా ఓపెన్ చేసిన ప్రతిసారి క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి ఆ బస్తాలో ఉన్న బియ్యం క్యాలిటీ పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి. లేదంటే బియ్యం స్టాక్ గోఔన్ నుంచి ఉపాధ్యాయులకు ఫోన్లు వస్తున్నాయి.
డీఈవో వద్ద ఫ్యాప్టో నేతల ఆవేదన
ఇటీవల పెరుగుతున్న బోధనేతర పనులు, శిక్షణలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక (ఫ్యాప్టో) నేతలు జిల్లా విద్యాశాధికారి నారాయణను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఒత్తిడిలో హెలిస్టిక్ ప్రోగ్రస్ కార్డులు పూర్తి చేయలేదనడం సరికాదన్నారు. ఎస్ఎల్డీటీ శిక్షణలు జిల్లా కేంద్రాల్లో కాకుండా అగిరిపల్లి, నల్లజర్లలో రెసిడెన్సియల్ విధానంలో ఏర్పాటు సరైన నిర్ణయం కాదని ఫ్యాక్టో నేతలు డీఈవోకు వివరించారు.
నెలరోజులుగా యోగాంధ్ర, మెగా పీటీఎంలతో సరి
ప్రస్తుతం లీడర్షిప్, ఎఫ్ఎల్ఎన్ శిక్షణలతో బిజీ
ప్రతీ రోజు గంట సమయం ఆన్లైన్, యాప్ల భారం
తరగతి గదికి దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయుల ఆవేదన
బోధనేతర పనుల ఒత్తిడిపై ఉమ్మడి పోరాటం
పాఠశాలలు తెరిచి రెండో నెలలో ప్రవేశించినా ఉపాధ్యాయులు సంతృప్తిగా పాఠాలు బోధించిన దాఖలాలు లేవు. యెగా డే, మెగా పేరెంట్స్ మీటింగ్కు సంబంధించి ఆన్లైన్ నమోదు, శిక్షణలతో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. బోధనేతర పనులు తగ్గించే వరకూ అన్ని యూనియన్లు ఉమ్మడి పోరాటంకు సిద్ధం కావాలి.
– పుప్పాల ప్రకాశరావు, రాష్ట్ర కార్యదర్శి, ఎస్టీయూ
ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం తగదు
పాఠశాల ప్రారంభం నెలల్లో జరుగుతన్న శిక్షణలకు అర్థగట్ల జెడ్పీస్కూల్ హెచ్ఎం ఎస్వీఆర్ మూర్తిరాజు బలయ్యారు. ఆన్లైన్ పనులు, శిక్షణల పేరుతో ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటం అడడుతున్నారు. ఇలా శిక్షణల పేరుతో టీచర్లను మానసిక ఒత్తిడికి గురి చేయడం తగదు.
– బోర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎంఎల్సీ

గురువుల మెడపై బోధనేతర కత్తి

గురువుల మెడపై బోధనేతర కత్తి

గురువుల మెడపై బోధనేతర కత్తి