కై కలూరు: రాష్ట్రంలో ఒకప్పుడు స్కాంపీ(మంచినీటి నీలకంఠ) రొయ్యల సాగు సిరులు కురిపించింది. ఆక్వా రంగంలో నూతన అధ్యాయనాన్ని సృష్టించింది. వైట్ టెయిల్ వ్యాధి విత్తన దశ నుంచి రావడంతో నర్సరీల్లోనే స్కాంపీ విత్తనాల మరణాలకు దారితీసింది. వ్యాధులు, సాగు సమయం ఎక్కువగా ఉండటం, పెరుగుదలలో వివిధ సైజులు వంటి కారణాలతో సాగు కనుమరుగైంది. ఈ తరుణంలో 2009 నుంచి వనామీ రావడం, తక్కువ ఉప్పు సాంద్రతలో సైతం పెరగడంతో రైతులందరూ ఈ సాగుకు మారారు. నేడు వనామీ సాగులోనూ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ రొయ్యలు అందుబాటులోకి వచ్చాయి.
అందుబాటులోకి స్కాంపీ విత్తనాలు
ఆంధ్రప్రదేశ్లో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. రొయ్యల సాగు చేసే రైతులు 1.5 లక్షల మంది ఉన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా ఇందులో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ప్రధానంగా వనామీ రకం సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్వం టైగర్ రొయ్యల సాగు తెల్లమచ్చల వైరస్ వ్యాధి బారిన పడడంతో చాలామంది రైతులు స్కాంపీ సాగును ప్రత్నామ్నాయంగా చేశారు. తర్వాత స్కాంపీని కూడా వ్యాధులు వదలలేదు. 2005 నుంచి స్కాంపీ సాగు తగ్గిపోయింది. తిరిగి జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి.
నాణ్యత కలిగిన స్కాంపీ విత్తనాల ఉత్పత్తి
కేంద్రీయ మంచినీటి ఆక్వా సాగు కేంద్రం, భువనేశ్వర్, ఒడిశా (సీఐఎఫ్ఏ) అనేక పరిశోధనలు జరిపి, స్కాంపీ రొయ్యలలో జన్యు పరంగా మెరుగైన రకాన్ని ఉత్పత్తి చేశారు. 2020 సంవత్సరంలో దీనికి సీఫా జీఐ స్కాంపీ ట్రేడ్ మార్క్తో కొన్ని ఎంపిక చేసిన హేచరీలకు బ్రూడ్ స్టాక్ని సరఫరా చేస్తున్నారు. ఈ హేచరీలలో జన్యు పరంగా మెరుగైన విత్తనం తయారు చేసి, రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఎంపెడా సంస్థ ఆర్జీసీఏ విభాగం కృష్ణాజిల్లా మంచినీటి రొయ్యలపై పరిశోధనలు జరిపి సెలక్టివ్ బ్రీడింగ్ ద్వారా మంచి నాణ్యత కలిగిన స్కాంపీ రకాలను ఉత్పత్తి చేసింది. నియో ఫీమేల్స్ ద్వారా ‘ఆల్ మేల్ స్కాంపీ’ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఒకే పరిమాణం, త్వరగా పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి కలిగిన రొయ్య విత్తనాన్ని రూపొందించారు.
చేపలతో పాటు రొయ్యల సాగు
ఆక్వా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. కొంతమంది సన్న, చిన్నకారు రైతులు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పాలీకల్చర్ ద్వారా చేపలతో పాటుగా రొయ్యలను పెంచి ఫలితాలు సాధిస్తున్నారు. జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ రొయ్యలను చేపలతో పాటు సాగు చేసుకునే అవకాశం ఉంది. స్కాంపీతో పాటుగా గోదావరీ నది ఆనకట్టల వద్ద లభించే కాళ్ళ రొయ్య విత్తనాన్ని సేకరించి మంచినీటి పెద్దచెరువులలోను, రిజర్వాయర్లలోను చేప పిల్లలతోపాటుగా వదిలి ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కాంపీ సాగును తిరిగి మెరుగైన రీతిలో అవలంభిస్తే విదేశీ వనామీ రొయ్యలపై ఎక్కువగా ఆధారపడనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. స్కాంపీ ఉత్పత్తి మొదలైనప్పుడు, దానికున్న మార్కెట్ను బట్టి వనామీ మార్కెట్కు డిమాండ్ తగ్గకుండా ధరల స్థిరీకరణకు అవకాశముంటుందని సూచిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం అవసరం
రైతులకు, హేచరీలకు సరైన సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన కలిగించాలి. జన్యుపరంగా మెరుగైన స్కాంపీ బ్రూడర్స్ను వీలైనన్ని ఎక్కువ హేచరీలకు సరఫరా చేయాలి. టెక్నీషియన్లు, ఫిషరీస్ అధికారులు, రైతులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హేచరీలలో అనుకూల మౌలిక సదుపాయాలు, వసతులు, బయోసెక్యురిటీతో బ్రూడర్స్ను సరఫరా చేసి బ్రీడింగ్నకు తగిన సలహాలు అందించాలి.
– డాక్టర్ పి.రామ్మోహనరావు, విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ
జన్యుపరంగా స్కాంపీ రొయ్య అభివృద్ధి
వనామీకి ప్రత్యామ్నాయమంటున్న నిపుణులు
కృషా ్ణజిల్లాలో ఆల్ మేల్ స్కాంపీ విత్తన అభివృద్ధి
నెల్లూరు, తణుకు ప్రాంతాల్లో బ్రీడింగ్ విత్తనాలు
మీసం మెలేసేందుకు నీలకంఠ రెడీ
మీసం మెలేసేందుకు నీలకంఠ రెడీ