
మా రొయ్యను మేమే అమ్ముకుంటాం
పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రోడ్డెక్కినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం శనివారం పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డు నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే మార్గ మధ్యలో ఓ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘ సెక్రటరీ బోణం చినబాబు మాట్లాడుతూ ప్రాసెసింగ్ ప్లాంట్లపై ఆధారపడి ఇప్పటివరకూ ఆక్వా రైతులు చాలా నష్టపోయారన్నారు. డొమెస్టిక్ సేల్స్ కేంద్రం ఇటు వినియోగదారుడు, అటు ఆక్వా రైతుకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే కొందరు మహిళలకు ఉపాది కూడా కల్పించినట్లు అవుతుందన్నారు. ఈ నెల 30 వ తేదీన శంకుస్థాపన చేస్తామని, అనంతరం మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి పక్కాగా ప్రారంభోత్సవం చేయాలనే సంకల్పంతో తమ సంఘం ఉందన్నారు. ప్రారంభం అయిన వెంటనే ఇక్కడ రూ.100కు రొయ్యలను అందజేస్తామన్నారు. అంతా రెడీ కుక్లా ప్యాకింగ్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా రైతు 100 కౌంట్కు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్న సమయంలో నేరుగా ఈ కౌంటర్ వద్దకు తీసుకువచ్చి తన రొయ్యను విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. లోకల్ సేల్స్ పెరిగిందంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే కౌంటర్ మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా అమలైందంటే ఈ కార్యక్రమం విజయవంతమైనట్టేనని అన్నారు. ఆక్వా సంఘ సభ్యులు మేడిది జాన్రాజు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం
ఏర్పాట్లు చేస్తున్న జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం