
ఏలూరుపాడులో పోలీస్ పికెట్
కాళ్ల/భీమవరం: కాళ్ల మండలం ఏలూరుపాడులో శనివారం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి సమీపంలోనే వినాయకుడి గుడి ఉండడంతో చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు ఫ్లెక్సీ ఇబ్బందికరంగా ఉందంటూ ఆ ప్రాంత జనసేన నాయకులు ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఫ్లెక్సీని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తొలగించారు. ఈ నేపథ్యంలో శనివారం ఆందోళనలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో యువకులు శాంతియుతంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వెళ్లిపోయారు. తొలగించిన ఫ్లెక్సీని వేరే ప్రాంతంలో యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి ఘటనలకు పాల్పడటం సబబు కాదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.