
ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండోరోజు గురువారం ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికోద్యోగుల పిల్లల కోటా, ఎన్సీసీ, క్రీడా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. క్రీడా కోటాకు సంబంధించి 245 మందికి 171 మంది, సైనికోద్యోగుల పిల్లల కోటాకు సంబంధించి 117 మందికి 79 మంది, ఎన్సీసీ కేటగిరికి సంబంధించి 341 మందికి 277 మంది, భారత్ స్కౌట్స్ గైడ్స్ కేటగిరికి సంబంధించి 247 మందికి 185 మంది హాజరయ్యారు. ఈనెల 30న ఎన్సీసీ, క్రీడా కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ప్రొఫెసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పర్యవేక్షించారు.
భారత సైన్యం సత్తాకు
ప్రతీక సిందూర్
తాడేపల్లిగూడెం: దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో గురువారం జరిగిన తిరంగా యాత్రలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక అని అన్నారు. ఈ విజయం భారత జవాన్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మాతృభూమి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి సైనికుడి జీవితం స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కన్నవాళ్లకు, కుటుంబాలకు దూరంగా దేశ సరిహద్దుల్లో రాత్రి పగలూ విధులు నిర్వర్తిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సైనికుల పోరాటపటిమకు సెల్యూట్ కొట్టాలన్నారు. దేశభక్తిని చాటే నినాదాలతో త్రివర్ణ పతాకాలతో విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. రిజిస్ట్రార్ దినేష్ రెడ్డి, నిట్ అధికారులు పాల్గొన్నారు.

ట్రిపుల్ ఐటీలో రెండోరోజు సర్టిఫికెట్ల పరిశీలన