
రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కే.గోపాల్ అన్నారు. గురువారం మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి రైతులు ఏ పంట వేస్తే మేలు చేకూరుతుందనే దానిపై కృషి జరగాలన్నారు. రైతులకు మేలైన వరి వంగడాలను అందించాలని, సాగులో పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి, లాభసాటిగా మార్చాలన్నారు. ఆరోగ్యకరమైన పంటలను పండించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో కోకో ప్రొసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక రైతాంగానికి ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తలు సూచించాలన్నారు. ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ.ప్రసాద్ మాట్లాడుతూ సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శేషు మాధవ్, భారతీయ ఆయిల్పామ్ పరిశోధన సంస్థ (పెదవేగి) డైరెక్టర్ డాక్టర్ కే.సురేష్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవీ.రమణ మాట్లాడారు. జిల్లా వ్యవసాయాధికారి జడ్. వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కే.దేవానంద్, ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, ఏడీఏ మురళీకృష్ణ, పశు, మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఉద్యాన వర్సిటీ ఉప కులపతి డాక్టర్ గోపాల్