
రజకుల చెరువులను సర్వేచేసి హద్దులు నిర్ణయించాలి
జంగారెడ్డిగూడెం:జిల్లాలోని అనేక రజకుల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, దీంతో రజక వృత్తికి ఆటంకం ఏర్పడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రజక చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడాలంటే చెరువులను సర్వేయర్లతో సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను రజక సంఘాలతో కలిసి పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రజకులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయిచిన 3.11 ఎకరాల కోనేరు చెరువు ఆక్రమణలకు గురవ్వడంతో రజక వృత్తి చేసుకునేందుకు రజకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావుతో మాట్లాడగా చెరువుని రజకులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారన్నారు. చెరువులో సరిగా నీరు లేనందున లీజు రూ. 11వేలు రద్దు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా రజక సంఘ మహిళా అధ్యక్షురాలు మెట్ట లక్ష్మీ ప్రసన్న, గ్రామ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో..
భర్తకు మెసెజ్ పెట్టి గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది.
ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో..