నేత్రపర్వం.. శివ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. శివ కల్యాణం

May 30 2025 1:09 AM | Updated on May 30 2025 1:09 AM

నేత్ర

నేత్రపర్వం.. శివ కల్యాణం

ద్వారకాతిరుమల : క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం శివదేవుని కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేశారు. ఆ తరువాత కల్యాణ తంతును ప్రారంభించి, సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల శివనామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను కన్నులపండువగా జరిపి, కల్యాణ మూర్తులకు హారతులిచ్చారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

జేఈఈ మెయిన్స్‌కు ఉచిత దీర్ఘకాలిక శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జేఈఈ మెయిన్స్‌లో అర్హత మార్కులు సాధించి సీట్లు సాధించలేకపోయిన పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ తెలిపింది. ఈ మేరకు ట్రస్ట్‌ ప్రతినిధులు అంగులూరు సర్వేశ్వరరావు, టీటీఎఫ్‌ రూజ్‌వెల్ట్‌ ఏలూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు ఉండి అత్యుత్తమ మార్కులు సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ఆ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జూన్‌ 21న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామని, అందులో ప్రతిభ చూపిన సుమారు 10 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 79816 96481, 93900 59900, 99595 07507 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ద్వారకాతిరుమలలో వర్షంతో ఇక్కట్లు

ద్వారకాతిరుమల: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ద్వారకాతిరుమలలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి తూర్పువీధిలోని డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరింది. కాలినడకన రాకపోకలు సాగించిన స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే టీటీడీ కాంప్లెక్స్‌ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. గ్రామంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం

యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మీద నుంచి బుధవారం గోదావరిలోకి దూకి గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై కె గుర్రయ్య తెలిపారు. వంతెనపై దొరికిన బైక్‌, సెల్‌ ఫోన్‌ ఆధారంగా అతను భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన షేక్‌ కాసు (24)గా గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చించినాడ వచ్చిన తల్లిదండ్రులు బైక్‌, సెల్‌ఫోన్‌ తమ కుమారుడివేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గోదావరిలో గాలించగా గురువారం మృతదేహం లభ్యమైంది. శవ పంచనామా చేసి, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

నేత్రపర్వం.. శివ కల్యాణం 1
1/1

నేత్రపర్వం.. శివ కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement