
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
నిడమర్రు : ఉపాధ్యాయ బదిలీలు ఈనెల 22వ తేదీ నుంచి విద్యాశాఖ ప్రారంభించింది. నేటి వరకూ ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ వేదికగా కొనసాగుతోంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయింది. నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మిగిలిన 94 ఖాళీలకు గురువారం ఏలూరు డీఈఓ కార్యాలయంలో అర్హతగల ఎస్ఏలకు పదోన్నతులు కల్పించి గ్రేడ్–2 హెచ్ఎంలుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేశారు. తర్వాత పీఎస్ హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్, పండింట్లకు ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ఎస్జీటీల బదిలీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నత అధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమయంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎస్జీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో మాత్రం అన్ని వర్గాల ఉపాధ్యాయులతోపాటు ఎస్జీటీలకు ఆన్లైన్లో బదిలీలు పూర్తయ్యేలా మార్గదర్శకాలు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి 10 వరకూ ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని 11వ తేదీన నూతన పాఠశాలల బదిలీ ఆర్డర్స్ విడుదలవుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఎస్జీటీలు గందరగోళంలో పడ్డారు. ఉన్నత అధికారుల హామీ ప్రకారం మాన్యువల్ బదిలీలే చేపట్టాలని ఎస్జీటీలు పట్టుపడుతున్నారు. కానీ అధికారులు మాన్యువల్ బదిలీల వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆన్లైన్ బదిలీలే పరిష్కారం అంటూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయంపై ప్రభుత్వం ఏవిధమైన జీవో ఇంత వరకూ ఇవ్వలేదని సంఘాలు చెబుతున్నాయి.
పోస్టుల ఖాళీల స్పష్టతకే ఆఫ్లైన్
జిల్లా విద్యాశాఖాథికారి కార్యాలయంలో జరిగే ఆఫ్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్జీటీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారంగా మండలాల్లోని పాఠశాలలు ప్రదర్శిస్తారు. అక్కడ పాఠశాల వివరాలు తెలుసుకుని ఐచ్ఛికాలు ఎంపిక చేసుకుంటే. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు ప్రదర్శిస్తుండటంతో మారాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతో ఐచ్ఛికాల ఎంపిక సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని సంఘాలు ముందు నుంచి అధికారులకు చెబుతున్నారు.
మాన్యువల్ చేపడితే ఇబ్బందులు ఇలా..
తాజా బదిలీల్లో జిల్లాలో 2,861 మంది ఎస్జీటీలు బదిలీల జాబితాలో ఉన్నారు. వీరంతా ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు, సీనియర్ టీచర్లు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్త చేస్తున్నారు. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని ఈ విధానం వల్ల కనీసం ఆయా మండలాల్లోని పాఠశాల స్థితిగతులు కూడా తెలియవని అంటున్నారు.
ఎస్జీటీల బదిలీలపై స్పష్టత కరువు!
ఆఫ్లైన్లో చేపడతామని అధికారుల హామీ
నేటి వరకూ ఉత్తర్వులివ్వని పాఠశాల విద్యాశాఖ
ఆన్లైన్లో తప్పులు దొర్లుతాయని గురువుల ఆందోళన
ఉమ్మడి జిల్లాలో బదిలీల జాబితాలో 2861 ఎస్జీటీలు
ఆన్లైన్ వల్ల నష్టపోతున్నాం
ఉంగుటూరు మండలం తల్లాపురం యూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తూ 2023 చేపట్టిన ఆన్లైన్ బదిలీల్లో కుక్కునూరు మండలం కమ్మరిగుడెం ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వరుస క్రమంలో దొర్లిన పొరపాటు కారణంగా అంత దూరం వెళ్లాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బదిలీల వల్ల అనేక మంది ఎస్జీటీలు నష్టపోతున్నారు.
– కె. కమల్కుమార్, ఎస్జీటీ, ఉంగుటూరు
ఆఫ్లైన్ బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలి
ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల్లో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఎస్జీటీలంతా ఆన్లైన్లోనే దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, జాయినింగ్ ఆర్డర్స్ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం తగదు. వెంటనే జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ బదిలీలకు ఉత్వరులు ఇవ్వాలి.
– సీహెచ్ శ్రీధర్, యూటీఎఫ్ అధ్యక్షుడు, ఉంగుటూరు
అధికారుల నుంచి స్పష్టత రావాలి
ఉన్నత అధికారులు జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల్లో జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఎస్జీటీలు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్ని కేటగిరి బదిలీలు, వెబ్ ఆప్షన్స్, ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఎస్జీటీలకు మాన్యువల్ ట్రాన్సఫర్ విషయంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
– ఏవీఎస్ఎస్ భాస్కరకుమార్, ఎంఈవో, నిడమర్రు

ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు

ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు

ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు