స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలకు ఆజ్యం | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ కోటాలో అక్రమాలకు ఆజ్యం

Jun 2 2026 12:20 AM | Updated on Jun 2 2026 12:20 AM

మోసానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా.. అన్ని వర్గాలను మోసం చేస్తోంది. మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయి. ప్రధానంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు అమ్మేశారు. స్పోర్ట్స్‌ కోటాలో గతంలో కొన్ని క్రీడలు, అంతర్జాతీయంగా అడిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా పెంచేశారు. జిల్లా స్థాయిలో ఆడినట్లు సర్టిఫికెట్లు ఉన్నా.. ఉద్యోగం కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగం రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. అక్రమ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి.

– తలారి వెంకట్రావు, వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే

కలెక్టరేట్‌లో మెరిట్‌ లిస్ట్‌ పెట్టాలి

చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేసింది. జాబితా విడుదలలో పారదర్శకత లేదు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో మెరిట్‌ లిస్టు పెట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం వారికి నచ్చినట్టుగా మార్చేసుకుంది. తద్వారా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టి బడాబాబులు జేబులు నింపుతున్నారు. వెంటనే మెగా డీఎస్సీపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. స్పోర్ట్స్‌ కోటా, కాల్‌ లెటర్లు, రిజర్వేషన్లపై ఆరోపణలు వచ్చాయి. నష్టపోయిన వారికి న్యాయం చేయాలి.

– మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. కేవలం ఇచ్చిన ఒక డీఎస్సీ 16 వేల ఉద్యోగాల్లోనే ఎన్నో అవకతవకలు జరిగాయి. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు ఎంతో పారదర్శకంగా ఇచ్చాం. ఎవరూ వేలెత్తిచూపకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ ఉద్యోగాలు మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం దారుణం.

– నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం

సిట్టింగ్‌ జడ్జ్‌తో విచారణ చేపట్టాలి

డీఎస్పీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడింది. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలి. ఆయన శాఖలో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం దారుణం. దీన్ని బట్టి చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం అవుతోంది. సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం పోరాడుతుంది.

– కంఠమని రమేష్‌,

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement