దేవీపట్నం: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇందుకూరుపేటకు చెందిన అయినాల త్రిమూర్తులు, గంగాధర్ తండ్రీ కొడుకులు. ఆదివారం మోపెడ్పై వీరు ఇందుకూరుపేట నుంచి ముసుళ్లకుంట వైపు వెళ్తున్నారు. గోకవరం, దండంగి ఆర్అండ్బీ రహదారిలో ఎం.రావిలంక, ముసుళ్లకుంట గ్రామాల మధ్యలో ప్రమాదకర మలుపులో వీరి వాహనాన్ని పోశమ్మగండి నుంచి గోకవరం వైపు వెళుతున్న నలుపు రంగు కారు ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి అయినాల త్రిమూర్తులు (60) అక్కడికక్కడే మృతిచెందాడు. గంగాధర్ (35) తీవ్రంగా గాయపడగా, గోకవరం ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
ఆ నంబర్ ప్లేటే ఆధారం
తండ్రీ కొడుకుల ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అయితే ఘటనా ప్రాంతంలో వీరిని ఢీకొన్న కారు నంబరు ప్లేటు సగభాగం విరిగి పడిపోయింది. దీనిని పోలీసులు గుర్తించి, ఆ కారును గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మేరకు దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


