● సబ్ స్టేషన్ ఉన్నా తప్పని ఇబ్బంది
● లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు
● కాలిపోతున్న మోటార్లు
● భక్తులకు ఇక్కట్లు
అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇవీ సమస్యలు
● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్ చేయడంతో లిఫ్టు పని చేసింది.
● పంపా నది ఒడ్డున ఉన్న బోర్ల నుంచి నిత్యం రత్నగిరిపై ఉన్న వాటర్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తూంటారు. ఈ మోటార్లు లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్నాయి. ఈ వేసవి మొదలయ్యాక ఇప్పటి వరకూ ఆరు మోటార్లు ఈవిధంగా కాలిపోయాయి. దీంతో రత్నగిరిపై నీటి సమస్య ఉత్పన్నమవుతోంది.


