సామర్లకోట: చోరీ కేసుల్లో నిఽందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సొత్తు రికవరీ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో కేసుల వివరాలను తెలిపారు. శుక్రవారం సాయంత్రం అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించారని అన్నారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన గండేటి సాయి, అనకాపల్లి జిల్లా భయ్యవరం గ్రామానికి చెందిన సంగ శ్రీనులను అరెస్టు చేశామన్నారు. సామర్లకోటలో గాంధీనగర్కు చెందిన కొల్లూరి బాలసరస్వతి రాజమహేంద్రవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో ఈ నెల 23న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. రెండు కిలోల 100 గ్రాముల వెండి, ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరగ్గా రికవరీ చేశారు. స్థానిక సాయి అభిలాష్నగర్లో మోటారు సైకిల్, సంపంగ తోటలోని అలమండ అప్పారావు ఇంట్లో సుమారు 9 గ్రాముల బంగారం, 11 తులాల వెండి వస్తువులు, టీవీని పై ఇద్దరూ దొంగించారని డీఎస్పీ అన్నారు. వీరి నుంచి మొత్తం రూ.1.96 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
మరో కేసులో..
ఇటీవల సామర్లకోటలోని మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాత ముద్దాయి సోమాదుల విష్ణును పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.70 వేలు ఉంటుంది. ఇతనికి ఇద్దరు మైనర్లు సహకరించారు. వీరికి సర్పవరం, అన్నవరం కేసులతో సంబంధం ఉందని పోలీసులు వివరించారు. కాగా ఇటీవల మెహర్ కాంప్లెక్స్లో టీవీఎస్ షోరూమ్ షట్టర్ తొలగించి రూ.1.60 లక్షలు దొంగిలించిన నేరాన్ని వీరు అంగీకరించారు. నిందితులను వేగంగా పట్టుకున్న క్రెం సీఐ అంకబాబు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ఇతర సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించగా, వాటిని డీఎస్పీ అందజేశారు.


