అనపర్తి: కోచింగ్ కోసం సికింద్రాబాద్ బయలుదేరిన తన కుమారుడు అదృశ్యమైనట్టు దుంగల నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. బలభద్రపురం గ్రామానికి చెందిన దుంగల దేవీశ్రీ వరప్రసాద్ (23) గేట్ కోచింగ్ నిమిత్తం ఈ నెల 25న సికింద్రాబాద్ బయలుదేరాడు. రాత్రి 8:30 గంటలకు బలభద్రపురంలో బస్సు ఎక్కి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రత్యేక ట్రైన్లో సికింద్రాబాద్కు బయలుదేరి వెళ్లాడు. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, అప్పటి నుంచి ఆచూకీ లభ్యం కాలేదని నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు.


