గోకవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సంబంధిత మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సంఘం ఆధ్వర్యాన శివరామపట్నంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ, గతంలో కూడా అనేకసార్లు పేపర్ లీకవడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీకవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కర్నాకుల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, రాష్ట్ర కన్వీనర్ కడితి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


