అనపర్తి: విద్యుత్ తీగ తెగిపడి ఎండు గడ్డి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 1200 ఎండు గడ్డి టెక్కీలు దగ్ధమైనట్టు బాధిత రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ లైన్కు సంబంధించిన తీగ తెగి రోడ్డు పక్కన నిల్వ ఉంచిన గడ్డి టెక్కీలపై పడడంతో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వీటిలో కొర్ల శ్రీనివాస్కు చెందిన ఐదు వందల టెక్కీలు, మందనక్క సత్యనారాయణకు చెందిన 300, కోరాడ రాఘవ 180, మహిపాల చంద్రరావుకు చెందిన 190 టెక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
గంజాయి కేసులో రెండు నెలల జైలు
రాజమహేంద్రవరం రూరల్: ఎన్డీపీఎస్ కేసులో నామవరం డి బ్లాక్ ఒడియాపేటకు చెందిన భీమవరపు ఆదిలక్ష్మికి రెండు నెలలు జైలుశిక్ష విధిస్తూ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్టేట్ కోర్టు న్యాయమూర్తి కుమారి కె.సాయిమౌనికరావు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గంజాయి కలిగి ఉన్న సమాచారంపై 2017 జూలై 25న ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకుని 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు అనంతరం పై విధంగా తీర్పు ఇచ్చారు.


