కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యానికి బానిసై, తన తల్లిని నిత్యం చిత్ర హింసలకు గురి చేస్తున్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు హత్య చేసిన సంఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ నగర్కు చెందిన ఉర్నాల దుర్గాప్రసాద్ (42) పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్య వెంకట రమణతో గొడవ పడుతూ ఉండేవాడు. అదే విధంగా సోమవారం రాత్రి ఫుల్గా మద్యం తాగి వచ్చిన దుర్గాప్రసాద్ భార్యతో గొడవ పడుతున్నాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం బాగా పెరిగిపోయింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న కుమారుడు తన తండ్రి గుండెల్లో స్కూడ్రైవర్ లాంటి పరికరంతో గుచ్చాడు. వెంటనే దుర్గాప్రసాద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడైన బాలుడిన ఇజువైనల్ హోమ్కు తరలించనున్నారు.


