దేవరపల్లి: వేసవి తాపానికి తట్టుకోలేక క్వారీ గోతిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీపురానికి చెందిన ర్యాలి త్రినాథ్ (20), మరో ఆరుగురు యువకులు కలిసి గ్రామ శివారున గల పాడుబడిన (తవ్వి విడిచిపెట్టిన) క్వారీ గోతిలో స్నానానికి వెళ్లారు.
గోతిలోని నీటిలో యువకులు ఈత కొడుతుండగా, త్రినాథ్ మాత్రం ఊబిలో కూరుకుపోయి మునిగిపోయాడు. తోటి యువకులు ఇచ్చిన సమాచారంతో త్రినాథ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు క్వారీ వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు విషయం తెలిపారు.
పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో క్వారీ గోతిలో గాలించి త్రినాథ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. కాగా.. త్రినాథ్ రాజమహేంద్రవరంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.


