● చమురు ధరలు పెంచడం అన్యాయం
● కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, చమురు ధరలు పెంచుకుంటూ పోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై అమలాపురంలో ఏబీసీ ఫుడ్ కోర్టు వద్ద జగ్గిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాట్ ట్యాక్స్ పేరులో దోచేస్తున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు రోడ్డెక్కి మరీ ధర్నాలు చేస్తుంటే, కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతుందన్నారు. ఆక్వా రైతులు రొయ్యల ధరలు పెంచాలని ఆందోళన చేస్తున్నా, పట్టించుకోవడం లేదని జగ్గిరెడ్డి అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులకు మేలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.


