● తక్షణం స్పందించిన అధికార యంత్రాంగం
● పీజీఆర్ఎస్లో 145 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీ ఇవ్వడానికి వచ్చిన కల్లేపల్లి ప్రియాంక వడగాడ్పుల ప్రభావంతో అస్వస్థతకు గురికాగా అధికారులు తక్షణమే స్పందించారు. ఆమెకు వెంటనే నీరు అందించి ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు నర్సింగ్ సిబ్బందిని పిలిపించి రక్తపోటు, సుగర్ పరీక్షలు నిర్వహించారు. 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి మాట్లాడుతూ ఆమె ఆరోగ్యం కుదుటపడేలా వైద్యాధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆమె పెన్షన్, రేషన్ కార్డు సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆనన్లైన్లో పరిశీలించగా ఆమె దరఖాస్తు ఆమోద దశలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా కూడా ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్లో 145 అర్జీలను స్వీకరించామని చెప్పారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు అందగా, వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట, ఇతర కేసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరై వారి సమస్యలను వివరించారు.


