ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లినప్పటికీ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, లైన్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెగిపోయిన లైన్లు, దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. ఎక్కడైనా ప్రమాదకర విద్యుత్ పరిస్థితులు కనిపిస్తే వెంటనే కాల్ సెంటర్ నంబర్ 1912కు లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు.


