తొండంగి: రత్నగిరిపై శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్పై పారిశుధ్య సిబ్బంది నుంచి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ‘ఇలాగైతే ఎలా పద్మావతీ!’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ఆ సంస్థ సక్రమంగా మెటీరియల్ ఇవ్వడం లేదని, ఇబ్బందులపై ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ బెదిరిస్తోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సత్రాల్లోని రూముల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్షీట్లు, దుప్పట్లు, ఇతర మెటీరియల్ను ఈఓ స్వయంగా పరిశీలించారు. అవి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్వైజర్, అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి సంస్థ ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్లు పని చేయడం లేదని శానిటరీ అధికారులు బదులిచ్చారు. దీంతో, సంస్థ నిర్వహణ తీరుపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాఖాపరంగా నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని కింది స్ధాయి అధికారులను ఆదేశించారు.


