రాయవరం: జిల్లాలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను 24,814 మంది విద్యార్థులు రాయనున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
38 పరీక్షా కేంద్రాలు
పరీక్షలకు 38 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, మూడు సోషల్ వెల్ఫేర్, ఒక కోఆపరేటివ్, 19 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 16,004 మంది దరఖాస్తు చేశారు. వీరిలో జనరల్ పరీక్షలకు 15,168, ఒకేషనల్ 836 మంది రాయనున్నారు. సెకండియర్కు 8,810 మంది దరఖాస్తు చేయగా, వీరిలో జనరల్ పరీక్షలకు 8,102, ఒకేషనల్ 708 మంది హాజరు కానున్నారు. మొత్తం మీద ఫస్టియర్, సెకండియర్ జనరల్ పరీక్షలకు 23,270, ఒకేషనల్ 1,544 మంది పరీక్షలు రాయనున్నారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా డీఈసీ, హైపవర్, ఆర్జేడీ, డీవీఈవో, ఆర్ఐవో అధికారుల స్క్వాడ్స్ ఉంటాయి.


