కల్యాణ వైభోగమే..
● ప్రారంభమైన లక్ష్మీనారసింహుని ఉత్సవాలు
● భక్తజన సంద్రమైన అంతర్వేది క్షేత్రం
అంతర్వేది రథాన్ని మెరక వీధికి తరలిస్తున్న భక్తులు
సఖినేటిపల్లి: అంతర్వేదిలో లక్ష్మీనృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుని జన్మదినం రథ సప్తమిని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించారు. ఏటాలానే ముద్రికాలంకరణ (శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెళ్లికుమార్తెగా చేసే కార్యక్రమం)ను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు శ్రీవారికి, అమ్మవారికి వైఖానస ఆగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేశారు. మామిడాకుల భస్మంతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి ఈ తంతును రమణీయంగా పూర్తిచేశారు.
కొపనాతి విగ్రహానికి పూలమాలలు
కల్యాణోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, పల్లిపాలెం అగ్నికుల క్షత్రియులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కల్యాణ వైభోగమే..


