వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ విధింపు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మోటారు వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ వసూలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, అది ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చిందని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ రోడ్డు భద్రతా సెస్ అనేది జీవితకాల పన్ను చెల్లించాల్సిన మోటారు వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేస్తారన్నారు. ఆ మొత్తాన్ని రహదారి భద్రతా చర్యల అమలుకు వినియోగిస్తామని తెలిపారు. మోటారు సైకిళ్లు, కార్లు, క్యాబ్లు, 3000 కిలోల కంటే తక్కువ బరువున్న 4 చక్రాల గూడ్స్ వాహనాలు (జీవీడబ్ల్యూ), నిర్మాణ సామగ్రి వాహనాలు, జీవిత పన్ను వర్తించే ఇతర వాహనాలపై జీవితకాల పన్నులో 10 శాతం రోడ్డు భద్రతా సెస్గా వసూలు చేస్తారని తెలిపారు.
28న రాష్ట్ర ఎస్సీ కమిషన్
చైర్మన్ పర్యటన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈ నెల 28న రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఇన్చార్జి కలెక్టర్ మేఘ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో షెడ్యూల్ కులాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు.
జాతీయ స్థాయి ఖోఖో
పోటీలకు హేమంత్
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి, ఆ గ్రామానికి చెందిన డి.హేమంత్ జాతీయ స్థాయి (సబ్ జూనియర్) ఖోఖో పోటీలకు ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ నాగేంద్రరావు తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ ఏలూరు జిల్లా ముండూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో హేమంత్ ప్రతిభ చూపి, హర్యానాలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. కాగా, హేమంత్తో పాటు ఇచ్చిన ఇచ్చిన పీడీ మనోజ్ఞను పలువురు అభినందించారు.
ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలకు శిక్షణ
సీటీఆర్ఐ: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్ఏఎంసీ పథకంలో శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ వాణిధర్ రమణ్ తెలిపారు. ఈ మేరకు గురువార ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ ట్రెండ్జ్ ఐటీతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నెల రోజుల శిక్షణ అనంతరం సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించడానికి అవసరమైన అవగాహన, ప్రాజెక్ట్ ప్రిపరేషన్, పథకాల వివరాలు, మార్కెట్పై అవగాహన కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 79897 89376, 88855 88872 నంబర్లను సంప్రదించాలని కోరారు.
నిర్దిష్ట సమయంలో రీసర్వే ప్రక్రియ
రాజమహేంద్రవరం సిటీ: రీ సర్వేలో 4వ విడతకు ఎంపికై న గ్రామాల్లో ఆ ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి పిలుపు నిచ్చారు. స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో గురువారం ఒక్కరోజు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. తద్వారా రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యమన్నారు. రీ సర్వేను 223 రోజులలో 140 పని దినాల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్, జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, దేవరపల్లి తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఐవోఎస్ టి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ విధింపు
వాహనాలపై రోడ్డు భద్రతా సెస్ విధింపు


