వివేకానందుని బోధనలు మార్గదర్శకం
అనపర్తి: స్వామి వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అనపర్తిలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం స్వామి వివేకానంద జయంత్యుత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దత్తాత్రేయతో పాటు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, ద్వారపూడి అయ్యప్పస్వామి ఆలయ వ్యవస్థాపకుడు కనకరాజు గురుస్వామి, అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకుడు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞేయనందాజీ మహరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా వివేకానంద సెంటర్ వద్ద ఉన్న స్వామి వారి విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుప్పలపూడిలోని ఆర్బీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో సమాజానికి విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. బండారు దత్తాత్రేయ, వైడీ రామారావు, కనకరాజు గురుస్వామిలకు జీవన సాఫల్య పురస్కారాలను, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మహరాజ్కు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డును స్వామి పరిజ్ఞేయనందాజీ మహరాజ్ అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


