నా కులాన్నే మార్చేశారు..
కలెక్టరేట్లో కానిస్టేబుల్ ఫిర్యాదు
కాకినాడ క్రైం: ఆన్లైన్లో తన కులాన్ని మార్చేశారని కాకినాడకు చెందిన ఓ కానిస్టేబుల్ జిల్లా కలెక్టర్, డీఆర్వోలకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ నేరంలో సస్పెన్షన్కు గురైన హెడ్ కానిస్టేబుల్, సచివాలయ మహిళా వీఆర్వో సాయంతో ఆన్లైన్లో తన కులాన్ని మార్చేశాడని కాకినాడకు చెందిన కానిస్టేబుల్ జగదీష్ గురువారం కాకినాడ కలెక్టరేట్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సుమోటో క్యాస్ట్ సర్వేని తన కులాన్ని మార్చేందుకు వినియోగించుకోవడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఓటీపీ వస్తుందని తెలిసి, సర్వేలో తనకు ఏ మాత్రం తెలియకుండా ముందుగా ఫోన్ నంబర్ మార్చి, తర్వాత ఏకంగా తన కులాన్నే మార్చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదులో ప్రస్తావించారు. సర్వే ప్రక్రియ పూర్తి అభద్రంగా ఉందని వాపోయారు. అసలు తన ప్రమేయమే లేకుండా తన కులాన్ని మార్చేయడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. బీసీగా ఉన్న తనను ఓసీ కేటగిరీలోకి మార్చేసి తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన హెడ్ కానిస్టేబుల్తో పాటు అతడికి సహకరించిన మహిళా వీఆర్వోపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తునిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం
సందడి చేసిన సినీనటి
ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజు
తుని రూరల్: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూమ్ను తుని పట్టణంలో సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్, బుల్లిరాజు సంయుక్తంగా ప్రారంభించారు. శుక్రవారం తుని వచ్చిన వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్ను, వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ ఇక్కడి అభిమానుల ఆదరాభిమానాలు చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పార్టు– 2 షూటింగ్ను తునిలో చేయాలని దర్శక, నిర్మాతలను కోరతామన్నారు. 16 సంవత్సరాల్లో 36 షోరూమ్లు ఏర్పాటు చేసి నాణ్యత గల, నూతన డిజైన్లతో వస్త్ర ప్రియులను ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమాన్యం ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. అనంతరం సినిమాల్లో డైలాగులతో అభిమానులను అలరించారు. అభిమానుల కేరింతల నడుమ గోదారి గట్టుమీద రామచిలకవే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తునిలో షోరూమ్ ప్రారంభించడం ద్వారా 36వ మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని షోరూమ్ చైర్పర్సన్, డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వచ్చే పర్వదినాలను రంజింపజేసే షాపింగ్ అనుభూతిని తమ సరికొత్త షోరూమ్ అందజేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ సీర్ణ రాజమౌళి అన్నారు. రానున్న క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు అనువైన వైరెటీలు అందుబాటులో ఉంచినట్టు మరో డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు అన్నారు. పెద్ద సంఖ్యలో వస్త్ర ప్రియులు, అభిమానులు పాల్గొన్నారు.


