
వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేను స్వాగతిస్తున్నాం
అమలాపురం టౌన్: వక్ఫ్ చట్టం–2025పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర తీర్పు(స్టే)ను ముస్లింలు స్వాగతిస్తున్నారని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడినప్పటికీ ఈ చట్టానికి వ్యతిరేకంగా వందలకు పైగా కేసులు వేయడంతో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిందని చెప్పారు. అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివాదాస్పద చట్టం గురించి వివరించారు. కోర్టు ఇచ్చిన స్టేను అనుసరించి కింది స్థాయిలో అధికారాలను డీనోటిఫై చేసేందుకు అనుమతించలేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారానే జరగాలన్న నిబంధన విధించిందని చెప్పారు. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించే అంశంపై కూడా కోర్డు స్టే ఇవ్వడంపై ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణలో అనేక లొసుగులు ఉన్నాయని ఆనాడే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు జగన్ పార్లమెంట్ ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయించి ముస్లిం పక్షపాతిగా నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా ముస్లిం సమాజం మైనార్టీల పట్ల ఏ పార్టీ ప్రేమాభిమానాలు చూపిస్తుందో గ్రహించాలని ఖాదర్ హితవు పలికారు.