
అక్రమ నిర్మాణం తక్షణం ఆపాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న తనపై గౌతమీ సూపర్బజార్ స్థలం గురించి అవినీతి ఆరోపణలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు వాటిని నిరూపించి వాస్తవాలు ఏమిటో తేల్చాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ సవాల్ చేశారు. ఐదు కోట్ల రూపాయలు తనకు ముడుపులు ఇచ్చినట్లుగా అప్పట్లో విమర్శించి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎందుకు నిర్మాణం ఆపడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఎదురుగా గల గౌతమి సూపర్ బజార్ కి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న భవంతి వద్ద బుధవారం వైఎస్సార్ సీపీ శ్రేణులతో కల్సి భరత్ ఆందోళన నిర్వహించారు. అవినీతితో అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలని, అవినీతి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినదించారు. చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, గౌతమీ సూపర్బజార్ భూమిపై చేసిన ఆరోణలు నిరూపిస్తారా? ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా? నిజాల నిగ్గు తేల్చుకుందాం వస్తారా? బహిరంగ చర్చకు అనే నినాదాలతో ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని పాడుకున్న వారు తనకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు కాంట్రాక్టర్ను ఎదురుగా పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేశారు. సుమారు 300 గజాల ఈ స్థలం ఖరీదు ఎంత, నాకు ఐదు కోట్ల రూపాయలు లంచం ఎక్కడ, ఎప్పుడు ఎందుకు ఇచ్చారో నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణ చేసిన శాసనసభ్యునికి లేదా అని ఆయన నిలదీశారు. ఒకవేళ కోర్టులో అంశం ఉంటే, అన్యాయంగా అక్రమంగా లీజుకి తీసుకున్నారని చెప్పినపుడు రద్దు చేయించాలి కదా అని భరత్ ప్రశ్నించారు. నా మామ అచ్చెన్నాయుడికి చెప్పాను, నా బామ్మర్దికి చెప్పేసాను దీన్ని ఆపేస్తానని గతంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్పారని అన్నారు. ఇప్పుడు అక్రమంగా మూడు ఫ్లోర్లు బిల్డింగ్ కడుతుంటే, ఆపకుండా ఏం చేస్తున్నారని భరత్ ప్రశ్నించారు. ఇంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తిని స్వాహా చేసే కార్యక్రమం చేపడితే ఎమ్మెల్యే నిద్రపోతున్నారా అని నిలదీశారు. అదే నీ సొంత స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటావా అని ప్రశ్నించారు. నగర నడిబొడ్డులో విలువైన స్థలం అన్యాక్రాంతం అయిందని ఎమ్మెల్యే చెబుతూ, నిలుపుదల చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఏమనాలన్నారు. ఎమ్మెల్యేగా ఆపడం చేతకాకపోతే హైకోర్టులో మేము ఇంప్లీడ్ అవుతామని భరత్ ప్రకటించారు. ఎమ్మెల్యేకు అంకితం భావం ఉంటే, హైకోర్టులో జీపీ ద్వారా ఆపాలని, లేకుంటే తాము ఆపుతామని హెచ్చరించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ పలు ఆరోపణలు చేశారని, ప్రతి పనిలోనూ 25 శాతం కమీషన్ పుచ్చుకున్నట్లు కరపత్రాలు వేశారని భరత్ గుర్తుచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నందున వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించకపోతే ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి, నీచమైన విమర్శలు చేసినట్టేనని భరత్ వ్యాఖ్యానించారు. గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజక్ట్కి గతంలో మంత్రి ఆదిమూలపు సురేష్ రూ.22 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారని, అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రూ.125 కోట్లు స్పెషల్ గ్రాంటు ఇచ్చారని అందులో భాగంగా రూ. 22 కోట్లు మున్సిపల్ అక్కౌంట్లోకి వచ్చాయని భరత్ వివరించారు. ఇప్పుడు గోదావరి గట్టు దగ్గర శంకుస్థాపన అంటూ హడావుడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ రూ.22 కోట్లతో చేయకుండా కుదించి రూ.8 కోట్లతో చేయడం ఏమిటని ఆయన నిలదీశారు.
నాపై చేసిన అవినీతి ఆరోపణలు
నిరూపించాలి
ఎమ్మెల్యే వాసుకి బహిరంగ సవాల్
విసిరిన మాజీ ఎంపీ భరత్
వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి
గౌతమీ సూపర్ బజార్ స్థలం వద్ద ధర్నా