అయోధ్య రాముని ధనుస్సుకు పూజలు | - | Sakshi
Sakshi News home page

అయోధ్య రాముని ధనుస్సుకు పూజలు

May 5 2025 8:08 AM | Updated on May 5 2025 8:08 AM

అయోధ్య రాముని ధనుస్సుకు పూజలు

అయోధ్య రాముని ధనుస్సుకు పూజలు

ఐ.పోలవరం: అయోధ్య రామయ్య కోసం తయారు చేసిన ధనుస్సుకు మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య భాగ్యనగర్‌ సీతారామ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 13 కిలోల వెండి, కిలో బంగారంతో ఈ ధనుస్సును ప్రత్యేకంగా రూపొందించారు. తొలుత ఆలయానికి చేరుకున్న ధనుస్సుకు ఆలయ సహాయ కమిషనర్‌, ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు, మేళతాళాలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. 14 ఏళ్ల వనవాసానికి ప్రతీకగా 14 కిలోల బరువుతో రూపొందించిన ఈ ధనుస్సు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలలో భక్తుల దర్శనార్ధం యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా భద్రకాళీ సమేత వీరేశ్వరుని ఆలయానికి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామి వారి మూలవిరాట్‌ వద్ద ధనుస్సుకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రత్యేక పూజలు చేశారు.

భార్యపై కత్తితో దాడి

రాయవరం: మండలంలోని సోమేశ్వరంలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎస్సై డి.సురేష్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోకవరం గ్రామానికి చెందిన దూలం శ్రీను, సోమేశ్వరం గ్రామానికి చెందిన సత్యకుమారిని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమేశ్వరంలో ఉంటూ శ్రీను కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడు నెలల నుంచి భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం సత్యకుమారి ఇంట్లో ఉన్న సమయంలో భర్త శ్రీను కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో ఆమె చేతులు అడ్డు పెట్టడంతో చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేర్చగా అక్కడ ఆమె చేతికి ఏడు కుట్లు పడ్డాయి. కొంతకాలంగా భార్య సత్యకుమారిని అనుమానంతో భర్త శ్రీను వేధిస్తున్నాడన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement