
13,549 హెక్టార్లలో వరి కోతలు పూర్తి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు జరిగిందని, ఇప్పటి వరకూ 13,549 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భద్రపరచుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సలహాలు, సూచనలు ఇచ్చి, పంటలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పలు సూచనలు చేశారు.
పంట దెబ్బ తింటే..
ఫ కోతకు 10–15 రోజులున్న దశలో చేను పడిపోయి నీట మునిగితే, బూజు తెగులు వల్ల గింజ రంగు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రొపికోనజోన్ (టిల్ట్/బంపర్/ప్రోపిగార్డ్) లేక ఒక గ్రాము కార్బండిజం (బావిస్టన్/ధనుస్టిన్/బెన్ఫిల్/బెన్గార్డ్) లేదా 2 గ్రాముల కార్బండిజం+మాంకోజెట్ (సాఫ్/సిక్సర్/కంపానియన్) చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
ఫ కోత కోసిన పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు) పనలపై పడేలా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి, ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోతే మడిలోనే ఉన్న పనలపై ఉప్పు నీరు జల్లుకోవచ్చు. ఒక వేళ పొలంలో నీరు నిలిచిపోతే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం జల్లుకోవడం ద్వారా గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా నివారించవచ్చు.
ఫ పనలు కుప్ప వేసే దశలో వర్షాల వల్ల పనలు తడిస్తే కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై జల్లుకుంటూ కుప్ప వేయాలి.
ఫ నూర్చిన ధాన్యం రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లోని గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడువాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి క్వింటాల్ ధాన్యానికి కిలో ఉప్పును 20 కిలోల పొడి ఊక లేక 4 కిలోల వరిగడ్డితో కానీ కలిపి పోగు పెట్టాలి. దీనివల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పారబట్టి నిలువ చేసుకోవాలి.
ఫ పూర్తిగా తడిసి, రంగు మారిన ధాన్యానికి మార్కెట్ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి ధాన్యం పచ్చిబియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు.
ఫ అకాల వర్షాలతో రైతులు
అప్రమత్తంగా ఉండాలి
ఫ జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు