ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 80 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఎండలు మండుతున్నా, ఎటు చూసినా భక్తజనమే కనిపించింది. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి పూజలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సత్యసాయి సేవా సంస్థలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు.


