అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26న అమలాపురం కిమ్స్ కళాశాలలో మీటింగ్ హాల్లో నిర్వహించనున్న జిల్లా ప్రథమ కౌన్సిల్ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కె.మల్లేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు సంఘ నాయకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, ఉద్యోగులను ఆహ్వానించారు. శనివారం ఉప్పలగుప్తం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, భీమనపల్లి పంచాయతీ, సహకార సంఘం, పీహెచ్సీ, జిల్లా పరిషత్ హైస్కూల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సంఘ బలోపేతానికి ప్రతి ఉద్యోగి భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. అమలాపురం తాలూకా అధ్యక్షుడు పి.కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బీహెచ్ఎస్కే వర్మ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్వర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కె.దినేష్ తదితరులు మద్దతు తెలిపారు.


