● కేసు నమోదు ● విలువ రూ.6 లక్షలు
దేవరపల్లి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యర్రవరం గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తున్న 14,470 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అధికారులు పట్టుకున్నారు. వివరాలను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ ఎ.సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి 14,470 కిలోల రేషన్ బియ్యం(326 బస్తాలు) లారీలో యర్రవరం పౌల్ట్రీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో సివిల్ సప్లయ్ జిల్లా సహాయ అధికారి నాగాంజనేయులు ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నట్టు సత్యనారాయణ తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసి, 6(ఎ), 7(1) కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు.
గో మాంసం స్వాధీనం
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గోమాంసాన్ని గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశారు.


