సాక్షి, అమలాపురం: ‘‘ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ఊదరగొట్టి.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొన్ని పథకాలను పక్కన పెట్టారు. మరికొన్నింటికి కోత విధించారు. ఈ రెండూ చాలవని మోగా డీఎస్సీలో అక్రమాలకు తెరలేపి దగా చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత ఇలా సమాజంలో అన్ని వర్గాల వారికి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్ల పాలనను మోసం.. నయవంచనతో సాగించిన చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’’ అని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో మున్సిపాలిటీలు, పలు మండల కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ నిరసనలు విజయవంతంగా సాగాయి. ఆయా నియోజకవర్గాలలో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఆలమూరులో..
కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఆలమూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు వచ్చి వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంఘీభావం పలికారు. కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి నాగిరెడ్డి, పాటి శివకుమార్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో..
రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో పార్టీ కో ఆర్డినేటర్ పాముల రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పార్టీ సీజీసీ సభ్యుడు కె.ఎస్.ఎన్.రాజు, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్, సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజు పాల్గొన్నారు.
అమలాపురం పరిధిలో..
అమలాపురం నియోజకవర్గం పరిధిలో అమలాపురం పట్టణం, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ చింతా అనూరాధ, వంటెద్దు వెంకన్నాయుడు, మట్టపర్తి నాగేంద్ర, షేక్ అబ్ధుల్ ఖాదర్, చీకట్ల కిషోర్, వంగా గిరిజా కుమారి, జిన్నూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో..
మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఐ.పోలవరం మండలంలో పాత ఇంజరం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత ఇంజరంలో మెండ వెంకన్న షాపు నుంచి ఎదుర్లంక అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీగా వెళ్లారు. పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, ఎస్ఈసీ సభ్యురాలు కాశి బాల మునుకుమారి పాల్గొన్నారు.
పి.గన్నవరం సెంటరులో..
పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో పి.గన్నవరం సెంటరులో నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. స్థానిక మూడు రోడ్ల జంక్షన్లో నిరసన ప్రదర్శన చేసి టీడీపీ మేనిఫెస్టోను తగలబెట్టారు.
సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో..
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కాజులూరు మండలం గొల్లపాలెం సెంటరులో పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దగ్ఢం చేస్తున్న పార్టీ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్కుమార్ తదితరులు
అమలాపురం నియోజకవర్గం అల్లవరంలో కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్న పార్టీ శ్రేణులు, పాల్గొన్న మాజీ ఎంపీ చింతా అనూరాధ తదితరులు
సూపర్ సిక్స్కు వెన్నుపోటుపై
వైఎస్సార్ సీపీ పోరు
జిల్లా వ్యాప్తంగా
మండలాల్లో నిరసన ప్రదర్శనలు
కూటమి మేనిఫెస్టో ప్రతుల దగ్ధం
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు


