● మొన్న రాజోలు.. నిన్న అమలాపురం
● డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు
● 21 మందికి పాజిటివ్ రావడంతో
ఆందోళన
అమలాపురం టౌన్: గంజాయిని కూకటి వేళ్లతో పెకలిస్తామన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. మొన్న రాజోలు, నిన్న అమలాపురంలో పట్టుబడ్డ వ్యసనపరుల వల్ల జిల్లాకూ గంజాయి వ్యాపించినట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో ఇటీవల కొత్తగా వచ్చిన డిటెక్టన్ కిట్ల (బయో చెక్)తో గంజాయి వినియోగించిన వారిని క్షణాల్లో పట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో రాజోలులో పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో డ్రగ్స్ కేసులు ఎదుర్కొన్న పాత నేరస్తులు, అనుమానితులకు డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేస్తే 10 మందికి పాజిటవ్ వచ్చింది. అలాగే అమలాపురం పట్టణ పరిధిలో ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీల సమక్షంలో 52 మందిని శనివారం రాత్రి పరీక్షిస్తే 11 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ పరీక్షల ద్వారా పట్టుబడిన వారిని పోలీసులు మొదటి తప్పుగా హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మరోసారి పట్టుబడితే కేసులు, అరెస్టులు తప్పవని వివరిస్తున్నారు. రాజోలులో పట్టుబడ్డ వారిని తక్షణమే డీఅడిక్షన్ సెంటర్కు పంపించారు. అమలాపురంలో పట్టుబడ్డ వారిపై నిఘా పెట్టారు.


