● ఎస్పీ రాహుల్ మీనా
● పాత నేరస్తులు, అనుమానితులు,
రౌడీ షీటర్లకు అవగాహన
అమలాపురం టౌన్: గంజాయి తాగడం వల్ల జీవితాలు నాశనమవుతాయని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. గంజాయి కేసుల్లో పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులైన 52 మందికి స్థానిక డీఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో శనివారం రాత్రి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి తాగడాన్ని గుర్తించేందుకు కొత్తగా వచ్చిన డిటెక్షన్ కిట్లతో 52 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 11 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. వారందరికీ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. మరోసారి పట్టుబడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక నుంచి అనుమానితులకు డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేస్తామని, పట్టుబడితే కేసులు, అరెస్ట్లతో పాటు డి అడిక్షన్ సెంటర్కు తరలిస్తామని తెలిపారు. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన పూర్తిగా మార్చుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దన్నారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం పట్టణం, రూరల్, ముమ్మిడివరం సర్కిళ్ల సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత కుమార్, మోహన్ కుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.


