సహకార సంఘాల
ఉద్యోగుల యూనియన్ డిమాండ్
అమలాపురం టౌన్: రూ.కోట్లలో నిల్వ ఉన్న షేర్ ధనాన్ని సహకార సంఘాల రుణాల ఖాతాకు జమ చేయాలని జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం డీసీసీబీని డిమాండ్ చేసింది. అమలాపురంలోని కళా వెంకట్రావు వ్యవసాయ సహకార సంఘ భవనంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశం సహకార ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య మాట్లాడుతూ ఉద్యోగులకు గుదిబండలా మారిన జీవో నంబర్ 322 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12 నుంచి సహకార ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలకు బదులు చెప్పకుండా చేస్తున్న సహాయ నిరాకరణ మరికొన్ని రోజులు కొనసాగించాలని సమావేశం తీర్మానం చేసింది. 2011 నుంచి ఆప్కాబ్ ద్వారా వచ్చిన 6 శాతం డివిడెండ్ను సంఘాలకు జమ చేయాలని, నెగిటివ్ క్లయిమ్స్ పేరుతో వసూలు చేస్తున్న వడ్డీ రాయితీని అప్పుల ఖాతాకు జమ చేయాలని కోరింది. ప్రస్తుతం సంఘాల నుంచి వసూలు చేస్తున్న 10 శాతం షేర్ ధనాన్ని 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ రుణాలను పాత పద్ధతి డీసీసీబీ మంజూరు చేయాలని సమావేశం సూచించింది. నేతలు పెంకే సత్యనారాయణ, కుంపట్ల అయ్యప్పనాయుడు, మట్టపర్తి జయరామ్, బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి ప్రసంగించారు.


