అంబాజీపేట: రాష్ట్రంలో మోసకారి, 420 అయిన చంద్రబాబుపై యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబాజీపేటలో ఏవీఆర్, వైఎస్సార్ కల్యాణ మండపంలో కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం జరిగిన బీఎల్ఏల నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఇప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మహానాడు పేరుతో మీటింగ్లు పెడితే జనాలు వచ్చి ఛీ కొడతారనే భయంతో కేవలం డీజిల్ సాకు చూపిస్తూ అక్కడక్కడ యూనిట్లు, క్లస్టర్ల మీటింగ్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని విమర్శిచారు. ఇచ్చిన హామీలను నిలబెట్టు కోలేదు కాబట్టే కార్యకర్తలు, ప్రజలు వచ్చి నిలదీస్తారనే భయపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పవిత్రమైన దేవాలయాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. గుడిలో కార్యక్రమాలు పెట్టి మహానాడు జరుపుకునే దుర్మార్గపు ఆలోచన చేయడం సిగ్గు చేటన్నారు. ఆక్వా రంగం మొదలు మొక్కజొన్న వరకు ప్రతీ ఒక్క రైతుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలను మానుకోకపోతే రాబోయే పుష్కరాల్లో ముంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పుష్కరాలకు సంబంధించి చేస్తున్న పనులన్నీ అవినీతి మయమేనన్నారు. డీఎస్సీని అవినీతి మయం చేసి లోకేష్ సూట్ కేసులు నింపుకున్నారన్నారు. లోకేష్కు సిగ్గుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ చేసి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి


