అయినవిల్లిలో నిర్మించే సబ్ స్టేషన్కు కొత్తపేట మండలం మందపల్లి నుంచి అయినవిల్లి వరకు 400 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. ఇందుకు విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. ఆ టవర్ల నిర్మాణంలో భాగంగా మూడు మండలాలు, మూడు గ్రామాల కూడలి అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామ పంచాయితీ పరిధి (అవిడి డామ్ సెంటర్)లో ప్రతి సంవత్సరం జరిగే ప్రభల తీర్థ స్థలం మీదుగా ఆ విద్యుత్ లైన్ను మళ్లిస్తున్నారు. అక్కడ సుమారు 10 సెంట్ల స్థలంలో హై పవర్ విద్యుత్ టవర్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఆ శాఖ అధికారులు, డివిజన్, మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో చిరుతపూడి గ్రామ పంచాయతీలో ఆయా గ్రామాల ప్రజలతో గడచిన రెండు నెలల్లో నాలుగు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాల్లో ఆయా గ్రామాల ప్రజలు హై పవర్ ఎలక్ట్రికల్ లైన్ వల్ల ప్రాణాలకు ప్రమాదముందని, లైన్ వేయవద్దని అభ్యంతరం చెప్పారు. అనాదిగా హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్న తీర్థానికి ఆటంకం కలగకుండా విద్యుత్ లైన్ వేరే ప్రాంతానికి మార్చుకోవాలని కోరారు. అయితే అధికారులు ఈ స్థలమే టవర్ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తీర్థ స్థలానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు.


