అమలాపురం టౌన్: కేరళం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను నిరసిస్తూ అమలాపురంలో జిల్లా సీపీఎం శాఖ గురువారం సాయంత్రం ధర్నా చేసింది. గడియారం స్తంభం సెంటరులో జిల్లా పార్టీ కన్వీనర్ కారెం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రంలో బీజేపీ, నరేంద్రమోదీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు, లొంగ దీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ధర్నాలో పార్టీ నాయకులు సీహెచ్. సూర్యప్రకాశరావు, సఖిలే సూర్యనారాయణ, పీతల రామచంద్రరావు, జి.దుర్గాప్రసాద్, ఇసుకపట్ల మంగాదేవి పాల్గొన్నారు.


