● అంతరాయాల నివారణకు
కంట్రోల్ రూమ్లు
● విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్
సాక్షి, పాడేరు: కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), పోలవరం జిల్లా పరిధిలో 73825 85554, 94906 10027 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.


